కవిత వల్లే కేసీఆర్ మళ్లీ మేల్కొంటున్నారు: మహేశ్ గౌడ్
- చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటన్న మహేశ్
- హైడ్రా నిబంధనలను కేసీఆర్ చదువుకోవాలని హితవు
- రాజకీయ ఉనికి కోసమే కేసీఆర్ బయటకు వస్తున్నారని ఎద్దేవా
- త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని వెల్లడి
- మంత్రివర్గ విస్తరణపై సీఎం నిర్ణయం తీసుకుంటారన్న పీసీసీ చీఫ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని చెరువుల కబ్జాల విముక్తి కోసం ప్రభుత్వం చేపట్టిన హైడ్రా చర్యలపై కేసీఆర్ అభ్యంతరం చెప్పడాన్ని పీసీసీ చీఫ్ తప్పుపట్టారు. నగరం చుట్టూ ఉన్న చెరువులను బీఆర్ఎస్ నాయకులే కబ్జా చేశారని, అందుకే హైడ్రా వల్ల ఆ పార్టీ నేతలకు ఇబ్బంది కలుగుతోందని ఎద్దేవా చేశారు. చెరువులను కబ్జాల నుండి విముక్తి చేస్తే కేసీఆర్ కి వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన నిలదీశారు. హైడ్రా నిబంధనల గురించి కేసీఆర్ చదువుకుంటే మంచిదని హితవు పలికారు.
టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కవిత వల్లే కేసీఆర్ మళ్లీ మేల్కొంటున్నారని, ఆమె భయం వల్లే ఆయన బయటకు వస్తున్నారని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ప్రజల కోసం కాకుండా రాజకీయ ఉనికి కోసమే బయటకు వస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డిక్లరేషన్లను అమలు చేస్తున్నామని చెబుతూనే, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా మహేశ్ గౌడ్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని, దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తయిందని తెలిపారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని ఆయన స్పష్టం చేశారు.